చరిత్రలో యుద్ధాల చుట్టూ అనేక కథలు ఉన్నాయి. కొన్ని రక్తపాతాలను వర్ణించే కథలు అయితే మరికొన్ని విచిత్ర ఘటనలను వివరించే కథలు ఉన్నాయి. అందులో ఒకటే ముక్కుకోత యుద్ధం. మధురై నాయకర్లకు మైసూర్ మహారాజు మధ్య జరిగిన యుద్దాన్ని ముక్కు కోత యుద్దమని పిలుస్తారు. తమిళంలో దీనిని మూక్కరు పట్టాన్ అని పిలుస్తారు. దీని వెనుక ఘోరమైన చరిత్ర ఉంది. మధురైని పాలించిన నాయకర్లలో తిరుమలై నాయకర్ సుప్రసిద్ధుడు. 1623 నుంచి 1659 వరకు పరిపాలన సాగించారు. తిరుమలై నాయకర్ మైసూర్ రాజు చామరాజు వడియార్ మధ్య శత్రుత్వం కారణంగా 1625లో యుద్ధం జరిగింది. మైసూర్ సైనలు తిండిగల్ చేరుకున్నాయి. అప్పుడు నాయకర్ సైన్యం మైసూర్ సేనలను శ్రీరంగపట్నం వరకు వెంబడించి ఓడించింది. ఆ తర్వాత మధురై, తంజావూరు, సెంజిని ప్రాంతాలను పాలించిన నాయకర్ల సంయుక్త దళాలకు విజయనగర రాజు, మైసూరు రాజుల సంయుక్త దళాలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బీజాపూర్ సుల్తాన్ నాయక సైన్యం విజయనగర రాజ్యాన్ని ఓడించి స్వతంత్ర రాజ్యాంగా ప్రకటించుకుంది. దీంతో మైసూరు రాజ్యానికి ఎదురు దెబ్బ పడింది.
మొదటి ముక్కు యుద్ధం :-
కోసేసిన ముక్కులను సంచుల్లో పెట్టి రాజులకు పంపిన క్రూరమైన ఘటన మొదటి ముక్కు యుద్ధంలో జరిగింది. మైసూరు రాజు నర్సరాజు కంటెనివా తన రెండు పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి, అలాగే విజయనగర రాజ్య పునస్థాపనకు 1656లో మధురై నాయకర్ పై దండెత్తారు. మైసూర్ సేనాని కుంబయ్య నాయకత్వంలో కన్నడ సేనలు తిరుమలై నాయకర్ ఏలుబడిలో ఉన్న సత్యమంగళం ప్రాంతంలోకి ప్రవేశించి స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరిపై దాడి చేశారు. బాధితుల ముక్కులను పై పెదవులతో సహా కోసేసి వాటిని గోనే సంచుల్లో కట్టి మైసూరు రాజుకు పంపించారు. అలా అనేక పట్టణాలపై దాడులు చేసిన మైసూరు సైన్యం దిండిగల్ తర్వాత మధురై వైపు దూసుకెళ్లింది.
రఘునాథ సేతుపతి సాయం :-
మైసూరు సేన ఆకస్మిక దాడితో కృంగిపోయిన తిరుమలై నాయకర్ అజ్ఞాతంలోకి వెళ్లి ప్రజలను రక్షించేందుకు ఉన్న మార్గాలను మంత్రులతో చర్చలు జరిపారు. ఇదే సమయంలో అనారోగ్యం కారణంతో తిరుమలై నాయకర్ పరిస్థితి ఆందోళనగా మారింది. మధురై ప్రజల ముక్కులను కోసే అవకాశం శత్రువులకు ఇవ్వకూడదని అనుకున్న నాయకర్ తన భార్య ద్వారా రామనాథపురంకు చెందిన రఘునాథ సేతుపతిని సాయం కోరారు. వెంటనే సేతుపతి 25 వేల మంది సైన్యాన్ని సేకరించి మధురై కి తీసుకెళ్లారు. మైసూర్ తో జరిగిన దాడిలో 12,000 మంది సైనికులు చనిపోయారు. దిండిగల్ లోని ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ కరువట్టుప్పోట్టల్ అని పిలుస్తారు. సేతుపతి దాడి సాయంతో మైసూరు రాజ్యం చెల్లాచెదిరైంది. సేతుపతి సైనికులు వారిని మైసూరు వరకు వెంబడించారు. అలాగే నాయకర్ రాజ్యం ప్రజల ముక్కులను కోసేసిన సైనికుల ముక్కులను కోసేశారు.
నోస్ వార్ విజయ స్మారక మండపం :-
విజయం సాధించి తిరిగి వచ్చిన సేతుపతి మధురైలో రాజు తిరుమలై నాయకర్ ఘన స్వాగతం పలికారు. సేతుపతి విజయానికి గుర్తుగా మధురై లోని తాళ్లకులంలోని రాతి మండపం నిర్మించారు. ఈ మండపానికి ముక్కరు పోర్ మండపం అని పేరు పెట్టారు. అది ఇప్పటికీ ఉంది. చరిత్రలో అత్యంత క్రూరమైన యుద్ధాలలో ఇది ఒకటి. ఈ యుద్ధ పద్ధతి శత్రువుల ముక్కులు, మీసాలు కత్తిరించి శాశ్వతంగా గుర్తుండి పోయేలా వారి ముఖాలను గుర్తుపట్టలేనంతగా చేసేవారు. మైసూరు రాజు నర్సరాజు కంటేనీవాతో ఉన్న తీవ్ర శత్రుత్వం కారణంగా ఈ యుద్ధం జరిగింది. శత్రుదేశం లో ఎవరైనా ఎదురైతే వారి ముక్కు పెదవని కత్తిరించండి మీకు బహుమతి ఇస్తాను అని మైసూరు రాజు చెప్పేవారు. సైనికులు ఆ ముక్కులను మైసూరు రాజుకు అంద చేసి తగిన బహుమతులు పొందారు. అందుకు ప్రతీకారంగా తిరుమలై నాయకర్ సేనలు సేతుపతి సైన్యంతో కలిసి మైసూర్లోకి ప్రవేశించి శత్రువుల ముక్కులు కోసి మధురై కి పంపారు.