Ananth Ambani Marriage : అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలో దొంగతనం.. ఢిల్లీలో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం దొంగతనం చేశారంటే?
గుజరాత్ లోని జామ్ నగర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలో ప్రపంచమంతా సోషల్ మీడియా ద్వారా వాళ్ల పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను చూసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. విదేశీ అతిథులు కూడా చాలామందే అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

ఓవైపు ముందస్తు పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతుండగా, మరోవైపు పెళ్లి వేడుకల్లో దొంగతనం చేయడానికి ఓ బ్యాచ్ ప్రయత్నించిందట. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. పెళ్లి వేడుకల్లో టైట్ సెక్యూరిటీ ఉండటంతో అక్కడ దొంగతనం చేయడం దొంగలకు సాధ్యం కాలేదు. కనీసం వేడుక జరుగుతున్న ప్రదేశం లోపలికి కూడా వెళ్లలేకపోయారు. దీంతో వాళ్లు అక్కడికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో దొంగతనం చేసి నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చికి చెందిన దొంగల బ్యాచ్.. గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లా జామ్ నగర్ కు చేరుకుంది. వివాహ వేడుక దగ్గరికి వెళ్లినా అక్కడ సెక్యూరిటీ టైట్ గా ఉంది. లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో అక్కడికి దగ్గర్లోని ప్రాంతాల్లో కొన్ని కార్ల అద్దాలు పగులగొట్టి ల్యాప్ టాప్, నగదును చోరీ చేశారు.
10 లక్షల డబ్బును కాజేశారు. రాజ్ కోట్ లో ఓ మెర్సిడిస్ కారు అద్దాలను పగులగొట్టి అందులో నుంచి 10 లక్షల నగదును తీసుకున్నారు. జామ్ నగర్ లో మరో కారు అద్దాలను పగుల గొట్టి ల్యాప్ టాప్ దొంగలించారు. తమ కార్ల నుంచి వస్తువులు పోయాయని పోలీసులకు కంప్లయింట్ రావడంతో వెంటనే పోలీసులు దగ్గర్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు.
సీసీ కెమెరాల ద్వారా దొంగలను గుర్తించి వాళ్ల ఫోటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించడంతో.. ఆ దొంగతనంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఇతర నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లను విచారించగా అంబానీ వేడుకల్లో దొంగతనం చేసేందుకే తాము తమిళనాడు నుంచి వచ్చామని పోలీసుల ముందు ఒప్పుకున్నారు.
కానీ.. అక్కడ కుదరకపోవడంతో వేరే చోట దొంగతనం చేశామని చెప్పారు. దీంతో పోలీసులు కంగు తిన్నారు. అంత సెక్యూరిటీ ఉండే అంబానీ పెళ్లి వేడుకల్లో ఎలా దొంగతనం చేద్దామని అనుకొని తమిళనాడు నుంచి వచ్చారు.. అని పోలీసులు అవాక్కయ్యారు.
ఈ గ్యాంగ్ రాజ్ కోట్, జామ్ నగర్, అహ్మదాబాద్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో గత నాలుగు నెలల నుంచి 11 చోట్ల దొంగతనాలు చేసినట్టు పోలీస్ విచారణలో తేలింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళలో కూడా ఈ గ్యాంగ్ మనుషులు ఉన్నారని.. వాళ్లు కూడా దొంగతనాలు చేయడం కోసమే ఆయా రాష్ట్రాలకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.