Drugs : భారత్లో మాదకద్రవ్యాల విషయంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. వేల కిలోల గంజాయిని పోలీసులు తగులబెడుతూనే ఉన్నారు. భారీ మొత్తంలో డ్రగ్స్ తో పట్టుబడుతున్న కేసులు నమోదవుతున్నాయి. అయినా ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల మత్తులో పడి ప్రాణాలమీదకు ఎందుకు తెచ్చుకుంటున్నారు. అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), మత్తుపదార్థాలు అలవాటైనవారిపై సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం దేశంలో 2004లో ప్రతి 300 మంది ఇద్దరు మాదక ద్రవ్యాలకు బానిసలు కాగా అది 2018 నాటికి ప్రతి 100 మందిలో నలుగురు ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు సర్వే నిర్వహించలేదు. ఒకవేళ తాజాగా సర్వే నిర్వహించి ఉంటే ఆ లెక్కలను చూసి ప్రభుత్వం షాక్ గురికావొస్తొందేమో.. అందుకేనేమో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిపుణుల వాదనలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి మన జీవితంలో మనకు తెలియకుండానే మత్తుపదార్థాలు అనేక రూపాల్లో వినియోగిస్తాం. ఉదాహరణకు నొప్పి నివారణ కోసం మనం హెరాయిన్ ఇంజెక్షన్ తీసుకుంటాం. హెరాయిన్ తయారీకి ఓపియం మొక్క మూలాధారం. ఈ ఓపీయం నుంచే నొప్పి నివారణ మందులు తయారవుతున్నాయి. ఈ మందుల వాడకం ఎక్కువగా ఉండే వారు హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాల వైపు మళ్లినట్లు ప్రపంచ నివేదికలు తెలుపుతున్నాయి. మాదకద్రవ్యాలు తీసుకోవడం తప్పు అని తెలిసినా.. ఎప్పుడో ఒక తప్పటడుగు వేయడం లేదా ఆస్పత్రిలో ఇచ్చిన ఔషధాలకు అలవాటుపడి క్రమంగా మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోయిన వారు ఉన్నారనడంలో నిజం ఉంది. వీరిని చట్టప్రకారం శిక్షార్హులను చేయడం ఏమాత్రం తగదు.
భారత్ లో మాదకద్రవ్యాల విస్తరణ యువతను చాపకింద నీరులా నిర్వీర్యం చేస్తోంది. ఈ డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని పాలకులు చెబుతున్నా, వాటి ఫలితాలు మాత్రం శూన్యమనే చెప్పాలి. కొత్తగా అధికారంలోకి వచ్చి వెంటనే ఆదరాబాదరాగా తనిఖీలు, చర్యలు తీసుకున్నా అవి నిరుగారిపోతున్నాయి. మత్తు పదార్థాల ప్రవాహం మాత్రం ఆగడం లేదు. మాదక ద్రవ్యాల మహమ్మారి విజృంభణను అడ్డుకోవాలంటే, మూలం నుంచి చికిత్స అందించాలి. డ్రగ్స్ కు బానిసలైన వారిని ఆ ఊబి నుంచి పూర్తిగా బయటకు తీసుకురావాలి. ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలు నిపుణుల సూచనల మేరకు ఉండాలి. మాదకద్రవ్యాల నిరోధక చట్టం విషయంలో పార్లమెంట్లో లోతైన చర్చ జరగాలి. ఈ చర్చల్లో 'ఓపియం' మొక్కపై ఎక్కువ దృష్టి సారించి, ఈ మొక్క నుంచి హెరాయిన్ వంటి మత్తుపదార్థాలు తయారు చేస్తారనే విషయాన్ని గ్రహించాలి. కొకెయిన్ ఉత్పత్తికి మూలమైన కోకా, గంజాయి మొక్కల గురించి కూడా చర్చలు జరపాలి. హడావుడిగా చట్టాలు చేయడం కంటే వాటి అమలు తీరుపై ఎక్కువగా చర్చించాలి,
మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా సమాజాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదంగా విజృంభిస్తోంది. ప్రజల భావోద్వేగాలను ఓట్లుగా మలచుకోవాలనే ఉద్దేశంతో పాలకులు ఆదరాబాదరాగా చట్టాలు చేస్తున్నారే తప్ప వాటిని అమలు పరుచడంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాస్తా హడావుడి పెంచి కేసులు నమోదు చేస్తున్నాయి. మత్తుకు బానిసలు అవుతన్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలి. డ్రగ్స్ను సామాజిక నేరంగా పరిగణించాలి. నో అడిక్షన్ మందు వాడడం వల్ల డ్రగ్స్ నుంచి యువతను సన్మార్గంలోకి తీసుకురావొచ్చు.