Delhi Congress Chief Resigns : ఎన్నికల వేళ కాంగ్రెస్కి షాక్.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అర్విందర్ రాజీనామా
అసలే లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ సమయంలో ఢిల్లీ కాంగ్రెస్ లో జరిగిన ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే.. ఆమ్ ఆద్మీ పార్టీతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది.
లోక్ సభ ఎన్నికల వేళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ తో పొత్తు పెట్టుకోవడం అర్విందర్ కు నచ్చలేదు. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదని.. అయినా కూడా ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ చెప్పినా వాళ్ల మాటలు బేఖాతరు చేసి పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అర్విందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేసినట్టు తన లేఖలో పేర్కొన్నారు.
Delhi Congress Chief : తన అభిప్రాయాన్ని అధిష్ఠానం పట్టించుకోలేదన్న అర్విందర్
ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు, ఇతర ముఖ్య నేతల అభిప్రాయాలకు భిన్నంగా కాంగ్రెస్ హైకమాండ్.. ఢిల్లీలో ఆప్ తో పొత్తు పెట్టుకుంది. దానికి నిరసనగా రాజీనామా చేసి.. తన అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ కు పంపిన రాజీనామా లేఖలో అర్విందర్ పేర్కొన్నారు.
అసలు.. కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసి, అవినీతి ఆరోపణలు, నిరాధార ఆరోపణలు చేసి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ శాఖ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కానీ.. ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకోవడంతో అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమికి మద్దతు తెలిపినట్టు లేఖలో సింగ్ తెలిపారు.
అదొక్కటే కాదు.. పార్టీకి చెందిన పలువురు నేతలకు పదవులను నియమించే సమయంలో కూడా తనకు అవకాశం ఇవ్వలేదని.. తను డీపీసీసీ చీప్ అని.. అయినా కూడా ఢిల్లీ ఇన్ చార్జ్ పదవులు నియమించే అవకాశం తనకు ఇవ్వలేదని అర్విందర్ ఆరోపించారు. అందరూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారని సింగ్ తెలిపారు. అలాగే.. కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ కు మూడే సీట్లు కేటాయించారని.. అది ఎంత వరకు సమంజసం అని అర్విందర్ మండిపడ్డారు.
ఆ మూడు సీట్లలో ఒక సీటు తనకు ఇచ్చినా.. సీనియర్లను దృష్టిలో పెట్టుకొని తాను పోటీ నుంచి పక్కకు తప్పుకున్నానని అర్వింద్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. కానీ.. మరో రెండు స్థానాల్లో మాత్రం అసలు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చారని.. తమ అభిప్రాయం తీసుకోకుండానే అభ్యర్థులను ప్రకటించారని మండిపడ్డారు.
ఈనేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని.. ఒక పార్టీకి అధ్యక్ష పదవిలో ఉండి తాను కార్యకర్తల, నాయకుల అసంతృప్తిని తీర్చలేనప్పుడు.. ఆ పదవిలో కొనసాగడం అనవసరం అని తెలుసుకొని పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో అర్విందర్ సింగ్ పేర్కొన్నారు.