రాబోయే లోక్ సభ ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలకంటే ముందే బీజేపీ తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 9 నియోజక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే తొలిజాబితాపై ఆ పార్టీలో అసమ్మతి రాజుకుంటుంది. 9 మంది జాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం ఇవ్వగా మరో నలుగురు కొత్తవారికి అధిష్టానం టికెట్లు ఖరారు చేసింది. జహీరాబాద్, హైదరాబాద్, నాగర్ కర్నూలు, మల్కాజ్ గిరి స్థానాల్లో పార్టీ కీలక నేతల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం టికెట్ ఆశించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పరోక్షంగా ఫైర్ అయ్యారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించడానికి మీకు మొగోడే దొరకలేదా అంటూ తీవ్రంగా ఎద్దేవా చేశారు. ఇప్పటికీ బీజేపీలో చేరని మాధవి లతకు హైదరాబాద్ సీటు కేటాయించడం పట్ల ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యే రాజా సింగ్ కు బీజేపీ ఫ్లోర్ లీడర్ అవకాశం కూడా దక్కకపోవడంతో.. విజయ సంకల్ప యాత్రతో పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్ల టాక్ వినిపిస్తోంది.
సీనియర్ నేత మురళీధర్ రావు మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఆశించి భంగపడినందుకు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అనుచరులతో సమావేశం నిర్వహించి తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానంటూ ఆయన సంచలన ట్విట్ చేశారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్నాళ్లుగా మురళీధర్ రావు అనేక కార్యక్రమాలు చేపట్టి తనకే టికెట్ దక్కుతుందని ఆశతో ఉన్నారు. ఈటల రాజేందర్ కు బీజేపీ అధిష్టానం మల్కాజ్ గిరి టికెట్ కేటాయిస్తూ శనివారం ప్రకటించడంతో ఖంగుతిన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ గెలుపునకు మురళీధర్ రావు సహకరించేనా? లేక మరో పార్టీలోకి వెళ్లేనా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. మల్కాజ్ గిరి సీటు కోసం దిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత ఎం.కొమురయ్య, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్ళ వీరేందర్ గౌడ్ సైతం పోటీపడ్డారు. కెట్ కోసం ఆశించి భంగపడిన నేతలంతా ఇప్పుడు ఈటల గెలుపు కోసం కృషి చేస్తారా? లేదా అనేది సస్పెన్స్ గా మారింది. అదేవిధంగా నాగర్ కర్నూల్ లోక్సభ టికెట్ ఆశించిన బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి కూడా బీజేపీ నాయకత్వంపై ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఇటీవలే వచ్చిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ కుమార్ కు నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించడంతో శృతి అసహనంతో ఉన్నట్లు సమాచారం.
జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఎమ్మెల్యే బీబీ పాటిల్ కు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న ఆలే నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్, మాజీ మంత్రి బాగా రెడ్డి కుమారుడు జయపాల్ రెడ్డి తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మొదటి జాబితాలో తమ పేర్లు రాకపోవడంతో మహబూబ్ నగర్ టికెట్ ఆశించిన డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆదిలాబాద్ స్థానంపై బీజేపీ అధిష్ఠానం తొలి జాబితాలో ఎవరి పేరు ప్రకటించక పోవడంతో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆదివాసీ బిడ్డ రెండోసారి గెలిస్తే ఎక్కడ కేంద్రమంత్రి అవుతాడో అని భయంతో కొంతమంది తెలంగాణ బీజేపీ నేతలను తనకు టిక్కెట్ దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరిపైన ఆధారపడిన వాడిని కాదని స్వతహాగా ఎదిగిన వ్యక్తిని గుర్తు చేశారు. రెండో జాబితాలో కచ్చితంగా టిక్కెట్ వస్తుందని భావిస్తున్నానని, ఒకవేళ టికెట్ రాకపోతే తన దారి తాను చూసుకుంటానని హెచ్చరిస్తున్నారు.