ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులు విరమించుకోవాలి

తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టియుటిఎఫ్) జిల్లా అధ్యక్షుడు ధరావత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ రమేష్ లు డిమాండ్ చేశారు.మంగళవారం వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూనే,మరోవైపు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య కుదింపుకు ఉత్తర్వులు జారీ చేయడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి ఉదాహరణ, నిజానికి వేసవి కాలమంతా ఉపాధ్యాయులకు,అధికారులకు శిక్షణ మరియు బడిబాట పేరుమీద అనేక కార్యక్రమాలు చేపడుతూనే మరొకవైపు పిల్లలు తక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతో టీచర్లను వేరే పాఠశాలలకు సర్దుబాటు చేయడం ద్వారా ప్రాథమిక పాఠశాలపై తీవ్రమైనప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు,ఒక తరగతి గది ఉండాలని చాలా కాలంగా ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు,మేధావులు డిమాండ్ చేస్తున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఒకటి నుంచి 5వ తరగతులకు-18 సబ్జెక్టులు, 60 మంది విద్యార్థులు ఉంటే, ఇద్దరు ఉపాధ్యాయులు ఏ విధంగా విద్యా బోధన సరైన రీతిలో చేస్తారని అన్నారు.ఈ చర్యలన్నీ ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటుకు అప్పగించే విధానాలే తప్ప మరొకటి కాదనీ,అదే ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు,ఒక తరగతి గది ఉండటం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గు చూపించడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాకుండా, తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి తరగతికి ఒక గది ఉండేలాగా ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని, విద్యారంగంపై ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.