శిక్షణకు వెళ్లబోయే నూతన కానిస్టేబుళ్లు క్రమశిక్షణను అలవరచుకోవాలి
సెలెక్టెడ్ అభ్యర్థులకు రాచకొండ రాచకొండ సీపీ తరుణ్ జోషి దిశా నిర్దేశం
హైదరాబాద్, క్విక్ టుడే : పోలీసు శిక్షణ యొక్క అసలు ఉద్దేశం ఎంపికయిన అభ్యర్థులకు క్రమశిక్షణ నేర్పి పోలీసు శాఖలో చేరిన తర్వాత సమర్థవంతంగా పని చేసేలా తీర్చిదిద్దడమేనని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్ పేర్కొన్నారు. సోమవారం అంబర్ పేట హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై త్వరలో శిక్షణకు వెళ్లనున్న సెలెక్టెడ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు కమిషనర్ దిశా నిర్దేశం చేశారు. వారిని ఉద్దేశించి సీపీ మాట్లాడుతూ.. పోలీసు కానిస్టేబుల్ శిక్షణకు వెళ్ళడం అనేది జీవితంలో ఒక చక్కటి నూతన దశ అన్నారు. శిక్షణలో భాగంగా వివిధ ప్రాంతాల శిక్షణా కేంద్రాలకు వెళ్ళే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ శిక్షణ సమయంలో నేర్పించే అంశాలను క్రమశిక్షణతో, అంకిత భావంతో నేర్చుకోవాలని హితబోధ చేశారు.
శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల కాలంలో నేర్చుకోబోయే అంశాలు శిక్షణ అనంతరం ఉద్యోగంలో చేరిన తర్వాత తమ విద్యుక్త బాధ్యతల నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. శిక్షణ కేంద్రంలో పరిచయం అయ్యే కొంతమంది కొత్త మిత్రులతో కలిసి శిక్షణ అనంతరం ఒకే చోట పని చేసే అవకాశం ఉందన్నారు. కాబట్టి శిక్షణ కేంద్రం అభ్యర్థులకు కొత్త మిత్రులను కూడా అందిస్తుందని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో శ్రద్ధతో, అంకితభావంతో అంశాలను నేర్చుకోవాలని, క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోలీసు శాఖలో చేరి ప్రజలకి సేవ చేయాలనే ఉన్నత లక్ష్యంతో ఎంతో మంది యువతీ యువకులు అహోరాత్రులు శ్రమించి, ఎంతో కఠిన శ్రమతో శారీరక దారుఢ్య పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి, కష్టపడి చదివి ఉద్యోగం సాధించడం ద్వారా తమ కలను సాకారం చేసుకున్నారని అన్నారు.
అటువంటి ఉన్నత ఉద్యోగంలో అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. పోలీసు ఉద్యోగం ద్వారా సమాజంలో వివిధ వర్గాల ప్రజలకు సత్వర న్యాయం అందించే గొప్ప అవకాశం లభిస్తుందన్నారు. శిక్షణ కేంద్రంలో తమ ప్రతిభా పాటవాల ద్వారా, తమ యొక్క మంచి ప్రవర్తన మరియు క్రమశిక్షణ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ అడిషనల్ డీసీపీ శ్యాంసుందర్, ఏసీపీలు నరేందర్ గౌడ్, ఇమ్మాన్యయేల్, సీఏఓ పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు.