పీర్జాదిగూడ, ఏప్రిల్ 29 (క్విక్ టుడే న్యూస్):-మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని సత్యనారాయణపురంలో ప్లాట్ల బాధితులు రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఈ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాధితుల వివరాల ప్రకారం.. మేడిపల్లి మండలం పరిధిలోని సత్యనారాయణపురం కాలనీలో 1982 సంవత్సరంలో సర్వే నెంబర్లు 11, 12, 19, 20, 21లలో జీపి అప్రూవల్తో చేసిన లే అవుట్ లో ఉన్న వందలాది ప్లాట్లను కొనుగోలు చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా అనేకమంది ఈ ప్లాట్లలో ఇంటి నిర్మాణాలు చేసి నివసిస్తున్నారు. వీటిపై అనేక లావాదేవీలు జరుగగా, వాటికి సంబంధించిన చట్టబద్ధమైన దస్తావేజులు వాటి యజమానుల వద్ద ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఖాళీగా ఉన్న 5 ప్లాట్లను లక్ష్యంగా చేసుకొని, అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తప్పుడు పత్రాలు తయారు చేసి, ఆయా స్థలాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. వారు ఈ ప్లాట్లను తమవని చెప్పుకుంటూ ప్లాట్ యజమానులను బెదిరిస్తున్నారు. వారిపైన దౌర్జన్యానికి పాల్పడి, కడుతున్న ప్రహరీ గోడలను కూలగొడుతామని, మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వమంటూ రౌడీ షీటర్లు, స్థానిక గుండాలను తీసుకొని బెదిరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, చట్టానికి వ్యతిరేకంగా, సామాన్య ప్రజల హక్కులకు భంగం కలిగించేలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రవర్తిస్తున్నారు. బాధితులు పోలీసులను సంప్రదించగా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా కబ్జాదారులకే పరోక్షంగా సహకరిస్తూ ప్లాట్ యజమానులను బెదిరిస్తున్నారు. భూమి యజమానులు, కాలనీ సంఘాలు , స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఇలాంటి అరాచకాలను ఇప్పటికైనా ఆపాలని వేడుకుంటున్నారు. అక్రమ పత్రాలతో భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్లాట్ యజమానులను బెదిరిస్తున్న రౌడీషీటర్లపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై బొడిగె రాందాస్ గౌడ్, మురారి సింగ్, అఖిల్ సింగ్, అఖిల్ రాజ్, ఉదయ్లపై బాధితులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో శ్రీ రమణ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 1999లో తాము ప్లాట్లు కొనుగోలు చేశామని బాధితులు తెలిపారు. కొందరు వ్యక్తులు తమ అనుచరులతో వచ్చి తమ ప్లాట్లపై దౌర్జన్యంగా దాడి చేశారని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు మేడిపల్లి పోలీసులను వేడుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
