Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు తాను పోటీ చేయబోయే నియోజకవర్గం పేరును ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీస్తున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించడంతో ఉత్కంఠకు తెరపడింది. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ సభను ఉద్దేశించి ఆయన ఈ మేరకు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తాను ఎంపీగా చేయాలనుకోవడం లేదని, ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నానని ప్రకటించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. కేవలం ఒక అసెంబ్లీ సీటు మాత్రమే జనసేన పార్టీ గెలుచుకుంది.
అందుకే ఈసారి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యే కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసి అధిక విజయాలు సాధించాలని పొత్తు పెట్టుకున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. పెద్ద మనుసుతో వెళ్లితే చిన్నవాళ్లమయ్యామని, అందుకే ఈ పొత్తు కుదుర్చుకోవడం వల్ల తక్కువ స్థానాలు దక్కాయని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి పోటీ చేసే అవకాశం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే జనసేన పార్టీ తరఫున ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్ బుధవారం రాత్రి మరో 9 మందికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. వారితో మాట్లాడి ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేశ్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణయాదవ్, ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్ లను పిలిచి మాట్లాడి ప్రచారం చేసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, భీమవరం నుంచి మంగళవారం పార్టీలో చేరిన పులపర్తి రామాంజనేయులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి దేవవరప్రసాద్ అభ్యర్థిత్వాలకు ఖరారు చేశారు. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులుతో భేటీ అయ్యారని. ఈ స్థానం కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, కాకినాడ గ్రామీణం నుంచి పంతం నానాజీ పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.