ఎన్నికల కోడ్ కూసేలోపు.. కొత్త రేషన్ కార్డులు వచ్చేనా?
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం 20 లక్షల దరఖాస్తులు
చేస్తాం అపి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అధికారంలోకి వచ్చి 70 రోజులు గడిచినా.. ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డుల జారీపై ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. రోజుకో అప్డేట్ వినిపిస్తున్నా.. అన్ని పథకాలకు అవసరమయ్యే రేషన్ కార్డుల జారీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం స్పష్టంగానే ఉన్నట్లు సమాచారం. ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటన జారీ చేయడం లేదు. దీంతో ఇప్పటికే అభయహస్తం దరఖాస్తు చేసుకున్నలబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి.. ఎలా అప్లై చేసుకోవాలి అనే అంశంపై చాలా మంది చర్చించుకుంటున్నారు. కాగా ప్రభుత్వం నుంచి మాత్రం కనీసం దరఖాస్తుల స్వీకరణ ప్రకటన
కూడా రాకపోవడం విడ్డూరంగా ఉంది. ఎమ్మెల్యేలు మాత్రం తమ అధికారిక పర్యటనల్లో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారు.
100 రోజుల్లో తమ హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని హామీ ఇస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ అనేది ప్రస్తుతం సుదీర్ఘ ప్రక్రియ. దరఖాస్తులు స్వీకరించడం ఒక ఎత్తు అయితే.. అర్హులను ఎంపిక చేయడం కత్తిమీద సాములా మారింది. నిబంధనల రూపకల్పన నుంచి అర్హుల గుర్తింపు వరకు ఎన్నో పైరవీలు కొనసాగే అవకాశం ఉంది. ఇంటింటి సర్వే ద్వారా అనర్హుల తొలగింపు వంటి అంశాలు చాలా ముఖ్యమైన అంశం. గతంలో ఉన్న రేషన్ కార్డుల లబ్ధిదారుల్లో ఇప్పుడు చాలా మంది అనర్హులుగా ఉన్నారు. పదేళ్ల కాలంలో ఎంతోమంది ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడినారు. ఇప్పుడు అనర్హులను తొలగిస్తే ప్రభుత్వంపై భారం తక్కువగా పడే అవకాశం మెండుగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 90.14 లక్షల రేషన్ కార్డులు ఉండగా ప్రస్తుతం మరో 20 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను జారీ చేస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగే చాన్స్ ఉంది.
అయితే ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలుకు రేషన్ కార్డు లింకప్ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సబ్సిడీ, గ్యాస్తోపాటు, ఆరోగ్యశ్రీ, యువతులకు స్కూటీలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి అన్ని రకాల సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేసింది. ఇటీవల స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల సమయంలోనూ రేషన్కార్డు నెంబర్ ను జత చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో రేషన్కార్డు లేని కొంత వరకు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రజాపాలన దరఖాస్తుల సమయంలో 20 లక్షల మంది తమకు రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. కాగా ప్రభుత్వం మాత్రం ఎటువంటి నిర్ణయం చెప్పకుండా నాన్చివేత ధోరణి కొనసాగిస్తోంది. మరో 30 రోజుల గడువు ఉండగా త్వరలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే చాన్స్ ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాసక్తతతో ఉన్నారు.