AP Elections 2024 : ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఈసీ వేటు.. ఎన్నికల ముందు అయోమయంలో జగన్
ఈనేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఎక్కువ ఫోకస్ పెంచాయి. ఈసమయంలో ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఈసీ షాక్ ఇచ్చినంత పని చేసింది. ఏపీకి చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాలపై ఎన్నికల కమిషన్ బదిలి వేటు వేసింది.
వెంటనే వీళ్లిద్దరికీ ఎన్నికల విధులతో సంబంధం లేని డ్యూటీని ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత ఎన్నికల కమిషన్ ఆదేశించింది. విజయవాడలో సీఎం జగన్ రోడ్ షో జరిగిన సమయంలో జగన్ పై రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతం విజయవాడ సీపీ రీజియన్ కావడంతో దాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల కమిషన్ కాంతి రాణాను బదిలీ చేసింది.
అయితే.. ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులు అధికార వైసీపీ పార్టీకి కొమ్ముకాస్తున్నారని.. 2019 లో ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వీళ్లిద్దరూ జగన్ కు, వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అందుకే వీళ్లిద్దరిపై ఈసీ బదిలీ వేటు వేసినట్టు తెలుస్తోంది.
AP Elections 2024 : ఎన్నికల షెడ్యూల్ వచ్చినా వైసీపీకి అనుకూలంగా పని చేశారా?
నిజానికి ఎన్నికల షెడ్యూల్ వచ్చాక.. ఎన్నికల కోడ్ ను ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. కానీ.. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఎన్నికల కోడ్ ను పాటించకుండా.. పోలీస్ అధికారులు అయి ఉండి కూడా అధికార పార్టీకి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణా కొమ్ము కాస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.
దీనిపై విచారణ జరిపిన ఈసీ వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అలాగే.. వీళ్ల స్థానంలో ఏ అధికారులను నియమించాలో.. ఒక్క స్థానంలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను ప్యానెల్ కు పంపించాలని సీఎస్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ కోసం కనీసం అడిషనల్ డీజీ, లేదా అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నవాళ్ల పేర్లనే పంపించాలని ఈసీ తెలిపింది. నిజానికి.. సీతారామాంజనేయులు, కాంతి రాణా ఇద్దరూ పోలీస్ అధికారులం అని మరిచిపోయి.. అధికార పార్టీ అండ చూసుకొని వైసీపీ అధికార ప్రతినిధుల్లా తయారయ్యారనే ఆరోపణలు, విమర్శలు చాలా రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి.
అంతే కాదు.. వీళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించారనే ఆరోపణలూ వస్తున్నాయి. అలాగే.. సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులోనూ ప్రతిపక్ష పార్టీల నేతలనే ఇరికించేందుకు కాంతి రాణా ప్రయత్నాలు చేస్తున్నారని.. ప్రతిపక్ష పార్టీని ఇరికించి.. రాజకీయంగా వైసీపీకి మేలు చేయాలని ఆయన ప్రయత్నాలు చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇలా.. అధికారులపై ఈసీ వేటు వేయడం ఇదే తొలిసారి ఏం కాదు. ఇప్పటికే ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై కూడా ఈసీ వేటు వేసింది. ఆయన వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారని గుర్తించిన ఈసీ ఆయన్ను బదిలీ చేసింది. అలాగే.. ఇప్పటి వరకు ఐదుగురు ఎస్పీలపై, ఒక ఐజీపై, ముగ్గురు కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది.
అందులో గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఉన్నారు. చిత్తూరు ఎస్పీ జాషువా, నెల్లూరు ఎస్పీ తరములేశ్వర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్.. వీళ్లంతా అధికార వైసీపీకి ఒత్తాసు పలికారని.. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదుతో.. వాళ్లందరినీ బదిలీ చేసింది ఈసీ.
మరోవైపు తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులపై ఈసీ వేటు వేస్తుండటంతో ఏం చేయాలో తెలియక వైసీపీ క్యాడర్ సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా 20 రోజులు కూడా లేవు. ఈనేపథ్యంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులపై బదిలీ వేటు పడటంతో జగన్ కాస్త అయోమయానికి గురవుతున్నట్టు తెలుస్తోంది.
ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు చేసే ప్రయత్నాల్లో ఈసీకి ఫిర్యాదు చేస్తూ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చూడాలి మరి.. ఎన్నికల వరకు ఇంకా ఏపీలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో?