Pithapuram : పిఠాపురంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు.. కారణం పవన్ కళ్యాణేనా?
నిజానికి పవన్ కళ్యాణ్ వల్లనే పిఠాపురానికి అంతటి క్రేజ్ వచ్చింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పిఠాపురం గురించి చర్చ జరిగింది అంటే పిఠాపురం నియోజకవర్గం ఎంత ఫేమ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
నిజానికి జనసేనాని పవన్ కళ్యాణ్ భీమవరం లేదా గాజువాకలో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ.. పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో పిఠాపురం ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. అందరూ పిఠాపురం గురించి మాట్లాడటం ప్రారంభించారు.
పిఠాపురం నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారో అప్పటి నుంచి ఇక పిఠాపురం మీద చాలామంది దృష్టి పడింది. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఆ నియోజకవర్గం మీదనే ఫోకస్ పెట్టాయి. అయితే.. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నందుకు కావచ్చు.. ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని పోలింగ్ ఇక్కడ జరిగింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం పెరిగింది.
Pithapuram : 86.63 శాతం పోలింగ్ నమోదు
పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఎక్కడెక్కడో ఉన్న జనాలు అందరూ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఉద్యోగం కోసం, ఇతర పనుల కోసం పిఠాపురం నుంచి వలస వెళ్లిన చాలామంది పిఠాపురం నియోజకవర్గ వాసులు ఎన్నికల్లో ఓటేసేందుకు ఇక్కడికి చేరుకున్నారు.
అందుకే.. పిఠాపురంలో ఈసారి 86.63 శాతం రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికల్లో చూసుకుంటే ఇదే నియోజకవర్గంలో పోలింగ్ శాతం కేవలం 80 శాతమే జరిగింది. 2014 ఎన్నికల్లో 79 శాతం వరకు మాత్రమే పోలింగ్ జరిగింది.
కానీ.. 2024 ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నందు వల్ల రికార్డు స్థాయిలో పోలింగ్ పెరగడం అనేది పవన్ కు శుభసూచకం అనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ కు ఎక్కువగా ఉద్యోగులు, యువత మద్దతు పలకడంతో పోలింగ్ శాతం కూడా పెరిగినట్టు తెలుస్తోంది.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు పాజిటివ్ గా వార్తలు వస్తుండటంతో ఎన్నికల ముందు ఇతర పార్టీలు కూడా భారీగానే ఓటర్లను ఆకర్షించేందుకు పలు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. భారీగానే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది.
ఇక్కడ ఓటింగ్ శాతం పెరగడానికి అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి పెద్ద పెద్ద నాయకులు రావడం, సినిమా స్టార్లు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించడంతో పిఠాపురం ప్రస్తుతం రాష్ట్రంలోనే టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.